Deepavali

🕉️ దీపావళి పండుగ 🕉️

డా.టి.(ఎస్)విశాలాక్షి.

భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి పండుగ. మన మహర్షులు ఏర్పరచిన మన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతో పాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకదీపావళి పండుగ“. సమగ్ర భారత దేశంలో హిందువులే కాక జైనులు, బౌద్ధులు, సిఖ్ఖులు కూడా పండుగను జరుపుకుంటారు.
నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్ హౌస్ లో కూడా దీపావళి
నాడు దీపాలు వెలిగిస్తున్నారు.

శరత్కాలంలోని ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి జగన్మాతను దేవీ నవరాత్రులలో ఆరాధిస్తాము, దశమినాడు విజయదశమి మహా పర్వదినముగా పండుగ చేసుకుంటాము. మాసం చివరిలో,
అమావాస్య నాడు కూడా జగన్మాతనే ఆరాధిస్తాము. మహాలక్ష్మీ పూజను, కుబేరలక్ష్మీ పూజను చేసుకుంటాము. మాస ప్రారంభంలోనూ, అంతమందు చివరి దినము నాడు కూడా జగన్మాతనే ఆరాధించడం వల్ల ఆశ్వయుజ మాసమంతా జగన్మాతను ఆరాధించిన ఫలం మనకు లభిస్తుంది.

అమావాస్యను, పౌర్ణమిని కూడాపూర్ణ తిథులుఅంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనము దీపావళి పండుగను జరుపుకుంటాము.

దీపావళి కూడా పెద్ద పండుగే ! ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనము అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి, అనిఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము, దేవతలనారాధిస్తాము.

దీపానాం ఆవళీదీపావళీ.”
దీపావళి అంటే దీపముల వరుస.

దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులుసూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానమాచరించటము, పితృ తర్పణాలివ్వటము, దానము చెయ్యటము, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటము, ఆకాశదీపము పెట్టటము.

ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గ దర్శనమవుతుంది.

మన సనాతన ధర్మంలోఅగ్ని ఆరాధనముఖ్యమైనది.
అగ్ని మిచ్ఛధ్వం భారత !” అన్నారు మహర్షులు.
భా అంటే కాంతి, ప్రకాశము. కాంతి యందు, ప్రకాశమునందు, వెలుగు నందు అనగా జ్ఞానమునందు రతి కలవారు, అభినివేశము, ఇచ్ఛ కలవారు భారతీయులు. అంటే జ్ఞానాన్ని కాంక్షించేవారు. అసలైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని కోరి సాధన చేసేవారు భారతీయులు.

ప్రధానంగా మనది అగ్ని ఆరాధన సంప్రదాయము. మన పూర్వీకులు నిత్యాగ్నిహోత్రులు, నిరతాన్నదాతలు. నిత్యము 24 గంటలు 365 రోజులు ప్రతి ఇంట్లోనూ ఒక గదిలోఅగ్ని గృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అగ్ని అసలు ఎప్పుడూ నిధనమవదు. అది మన సంప్రదాయము. అగ్నిలో సర్వదేవతలు ఉంటారు. ఒక్క దీపము వెలిగించి అక్షింతలు వేసి నమస్కరిస్తే, సర్వదేవతలను ఆరాధించిన ఫలం లభిస్తుంది. “అగ్ని ముఖా వై దేవాఃఅన్నారు.
మనము ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపమును, దీపజ్యోతిని ఆరాధిస్తాము. శుభకార్యములు చేసినా, వేడుకలు చేసినా, గొప్ప ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, దైవ ప్రార్థన చేసి, అప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకుంటాము. వివాహములు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాము. అంటే దీపము, దీపములో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపము వెలిగించటము అన్నది అత్యంత ప్రధానమైనది అని అందరికీ తెలియజేయటానికి, అందరి చేత దీపములు వెలిగించబడటానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు.

దీపస్త్వం బ్రహ్మ రూపోऽసి
జ్యోతిషాం ప్రభురవ్యయః
దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము.

ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాము. అలా వెలిగించడం ప్రారంభించిన దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాము. కార్తీకమాసం కూడా దీప ప్రజ్వలనకు అత్యంత ప్రధానమైన మాసము. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీకములో అయ్యవారినిపరమశివుడిని ఆరాధిస్తాము.

హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహవతారంలో వచ్చి హిరణ్యక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మ దేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదాఅని ఆలోచించి, “నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండిఅని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా అమావాస్య నాడు
దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచ జన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము.

నరకుడు  అజ్ఞానానికి ప్రతీక. నరకము అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి.

ఇంక, నరకుడి చెరలో ఉన్న 16 వేల మంది స్త్రీలను విడిపించినప్పుడు వారందరూ శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా వరించారు. 16 వేల మంది అంటే అర్థం ఏమిటి? అంటే, మనకు కల ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, మనోబుధ్యహంకార చిత్తములు అనబడే అంతరింద్రియముఅంతఃకరణము. ఇవన్నీ కలిసి 16. 16 అజ్ఞానంతో ఆవరించబడి ఉండటమే నరకుడు 16 వేల మందిని చెరబట్టటం. ఎప్పుడైతే మన ఇంద్రియాలు, మనసు, అంతఃకరణము అన్నీ పరమాత్మ వైపు మరలుతాయో, అప్పుడు జీవుడు పరమాత్మను ఆశ్రయించినప్పుడు, అతని అజ్ఞానము నశించి జ్ఞానవంతుడై పరమాత్మను చేరుతాడు. అదే శ్రీకృష్ణుడు విడిపించిన 16,000 మంది శ్రీకృష్ణుడిని వరించటము అని అంటే !

దీపావళి పండుగను అజ్ఞానము మీద జ్ఞానము యొక్క, అంధకారము మీద వెలుగు యొక్క విజయముగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయముగాను చెప్పవచ్చును.

అసతోమా సద్గమయ.
తమసో మా జ్యోతిర్గమయ.
మృత్యోర్మా అమృతం గమయ.”

నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాయిద్యములు మ్రోగించి సత్యభామా శ్రీకృష్ణులకు స్వాగతం చెప్పారు. మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగద్రొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైన రోజు ఈరోజు కనుక ఈరోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరుకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగము, త్రేతా యుగము, ద్వాపర యుగములకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచ పాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవే కాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు.

పద్మ పురాణము, స్కాంద పురాణాలలో దీపావళి గురించిన ప్రస్తావన ఉంది.

చతుర్దశి మొదలు మూడు రాత్రులు దేవాలయములలో, మఠములలో, ఉద్యాన వనములలో, వీధులలో, ఇళ్ళల్లో, గోశాలలలో, గుర్రములు, ఏనుగులు ఉండు చోట్లల్లో దీపాలు వెలిగించాలి అని శాస్త్ర వచనము.

ఆశ్వయుక్కృష్ణపక్షస్య
చతుర్దశ్యాం విధూతయే !
తిల తైలేన కర్తవ్యం
స్నానం నరకభీరుణా” !!

ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు ఉదయం చంద్రుడు ఉండగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. సూర్యాస్తమయ సమయంలో నరకాసుర వధ జరిగింది కనుక
విథూయంలో అభ్యంగన స్నానమాచరించాలి అని పెద్దలు చెప్పారు.

తైలే లక్ష్మీర్జలే గంగా
దీపావళ్యాశ్చతుర్దశీమ్
!
ప్రాతః స్నానం తు యః కుర్యాత్,
యమలోకం పశ్యతి!!”

దీపావళి ముందరి చతుర్దశి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగా మాత ఆవేశించి ఉంటారుఅని పద్మ పురాణం చెప్తోంది. ఆరోజున సూర్యోదయాత్పూర్వం స్నానం చేసిన వారు యమలోకాన్ని దర్శించరట.

నువ్వుల నూనె శరీరానికి పట్టించుకుని అభ్యంగన స్నానం చేయటం వలన శనిదోష నివారణే కాకుండా, కండరాలు నరాలు దృఢపడతాయి. నరక చతుర్దశి రోజున తెల్లవారుఝామున స్వాతి నక్షత్ర కాంతి నీటిపై తన ప్రభావం చూపిస్తుంది.
దీపావళి రోజు అమావాస్య కనుక సూర్యుడు తన సంపూర్ణ ప్రభావాన్ని
చూపిస్తాడు. జలాధిపతి అయిన వరుణుడు తన అనుగ్రహాన్ని నీటిలో ఉంచుతాడు. కనుక స్నానం ఆరోగ్యాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది.

మనలో ఉన్న చెడుని వదిలి, మంచిని పొందటానికి రోజే నాంది
పలకాలి అని పెద్దలు ఇటువంటి ఆచారాన్ని కలిగించారు. పెద్దల చేశ ఆశీః పురస్సరంగా తలకి నువ్వుల నూనె పెట్టించుకున్నాక, ఉత్తరేణి కొమ్మను తల మీద ఉంచుకుని తల అంటుకోవాలి. చల్లని నీళ్ళల్లో వేడి నీళ్ళు కలిపి, దుచ్చెన చెట్టు కొమ్మను కానీ, ఆముదపు చెట్టు శాఖను కానీ, ఆనపతీగ కొమ్మ కానీ నీటిలో తిప్పి స్నానం చెయ్యాలి. స్నానానంతరం నల్ల నువ్వులు చేతిలోకి తీసుకుని
యమాయ తర్పయామి, తర్పయామి, తర్పయామిఅంటూ యమ తర్పణాలు వదలాలి. వదిలేటప్పుడు ఇలా చెప్పుకోవాలి

యమాయ ధర్మరాజాయ
మృత్యవే చాంతకాయ !
వైవస్వతాయ కాలాయ
సర్వభూతక్షయాయ !!
ఔదుంబరాయ ధర్మాయ
నీలాయ పరమేష్ఠినే !
మహోదరాయ చిత్రాయ
చిత్రగుప్తాయ తే నమః“!!

యమధర్మరాజుని,
చిత్రగుప్తుని, యమునా దేవిని కూడా స్మరించి నమస్కరించాలి.

నరకాసురుని వధను స్మరించటమంటే మనలో ఉన్న దుర్గుణాలను దగ్ధం చేసి, సద్గుణాలను పొంది ఉన్నతుల మవాలి అని సంకల్పించుకోవటమే ! మనలోని అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతి ప్రకాశించాలి. అదే దీపావళి పండుగ.

నరక చతుర్దశి నాడు యమ ప్రీతికై పూజలు నిర్వహించి దీపాలను వెలిగించాలి. అలా చేస్తే పితృదేవతలు నరక విముక్తులై స్వర్గానికి చేరుతారు.

నరకాయ ప్రదాతవ్యో
దీపాన్సంపూజ్య దేవతాః !
చతుర్దశ్యాం తు యే దీపాన్
నరకాయ దదన్తి !!
తేషాం పితృగణాస్సర్వే
నరకాత్స్వర్గమాప్తుయాత్“!!

దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను
సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో దివిటీను కొట్టిస్తారు.
పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, “దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితిఅని అనిపిస్తారు. తరువాత కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి, కళ్ళు తడి చేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. ఆనందంగా ఎంత సేపన్నా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరకడ్డీలు, అగ్గిపెట్టెలు, విమానాలు, రాకెట్లు, వెన్న ముద్దలు మొదలైనవన్నీ కాల్చవచ్చు. కానీబాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలిఅని ధర్మశాస్త్రం చెప్తోంది.

సాధారణంగా అందరూ దీపావళికి ముందే ఇంటికి వెల్ల వేయించుకుంటారు. పండుగనాడు ఇంటి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు, బంతిపూల మాలలు కడతారు. పెద్ద పెద్ద రంగవల్లులతో ఇంటి ప్రాంగణమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ముగ్గుల మధ్యలో
పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి దీపాలు పెడతారు. పండుగ ఐదు రోజులు, కార్తీక మాసమంతా సూర్యోదయాత్పూర్వము, సూర్యాస్తమయ సమయంలోను దేవుని దగ్గర, తులసి కోట దగ్గర దీపాలు పెట్టడమే కాక, ఇంటి గుమ్మాలకి ఇరువైపులా దీపపు ప్రమిదలు పెడతారు. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి, వత్తులు వేసి వెలిగించి

దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతి జనార్ధన !
దీపో మే హరతు పాపం
దీపజ్యోతీ నమోऽస్తు తే“!!
అని పగలు,
“….సంధ్యా దీపం నమోऽస్తు తేఅని సాయంత్రము ప్రార్థిస్తాము.

దీపావళి నాడు సాయంత్రం ప్రమిదలలో దీపాలు వెలిగించాక,

శుభం కురుధ్వం కళ్యాణ
మారోగ్యం ధన సంపదం !
శత్రుబుద్ధి వినాశాయ
దీపజ్యోతీ నమోऽస్తు తే“!! అని జ్యోతులను ప్రార్థించాలి.

తరువాత దీపాలను వరుసగా ఇంటి లోగిళ్ళలో పిట్టగోడల మీద, డాబా మీద పెడతాము. జ్యోతులను వెలిగించటం మన సనాతన సంప్రదాయము.
అది మన భారతీయ సంస్కృతి.
అందుకే రోజూ పూజా గృహంలోనూ, తులసి కోట దగ్గర దీపాలు పెడతాము. అన్ని శుభకార్యాలలో, శుభ సందర్భాలలో వేదికల మీద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు దీప ప్రజ్వలనము చేస్తాము. ఎట్టి పరిస్థితులలోనూ మనము దీపాలను కొండెక్కించము. వాటంతర అవే నిధనమవాలి.

కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనినిఅలక్ష్మీ నిస్సరణముఅంటారు.

దీపావళి పండుగకి ముందే అనేక రకాలైన మిఠాయిలుఅరిసెలు, లడ్డూలు, మైసూర్ పాకులు, జిలేబీ, కజ్జికాయలు, బూందీ, జంతికలు, కాజాలు మొదలైనవి ఎన్నో రకాలు తయారుచేసి, వాటితో పాటు దీపావళి నాడు ఇంట్లో వండిన పులిహోర, పరమాన్నము, గారెలు, బూరెలు లేక బొబ్బట్లు లాంటి వాటిని ఇరుగుపొరుగు వారికి ఇచ్చి, బంధువులతో కలిసి భోజనం చేస్తాము. ఒక్కరే తినటం అన్నది మన సంస్కృతి కాదు.
సహనౌ భునక్తుఅని మనకు వేదం చెప్తోంది. కలిసి మెలిసి ఉండటమన్నది సృష్టి ధర్మం. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కూడా తమకు సహకరించే వారికిఅంటే ఇంట్లో పని చేసే వారికి, చాకలి వారికి, పోస్ట్ మాన్ కి, పాలు పోసే వారికి, పూలను ఇచ్చేవారికి, ఇలా అందరికీ కూడా కొత్త బట్టలు ఇచ్చి, బహుమతులు, మిఠాయిలు, బాణసంచా పంచిపెట్టి మన ఆనందాన్ని వారికి
పంచుతాము.

దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని, తర్వాత
నరక చతుర్దశిని, అమావాస్యనాడు దీపావళిని, తరువాత రోజును
బలిపాడ్యమిని, మరుసటి రోజును భగినీ హస్త భోజనము లేక యమద్వితీయ అని, వరుసగా ఐదు రోజుల పండగ చేసుకుంటాము.

ధన త్రయోదశి నాడు ధనలక్ష్మితో పాటుగా ధన్వంతరిని కూడా పూజించాలి. ఆయన క్షీరసాగర మథన సమయంలో అమృతభాండంతో పాలసముద్రంలోనుంచి ఆవిర్భవించాడు. ఆయన ఆరోగ్య ప్రదాయకుడు, రోగనివారకుడు, అమృత ప్రదాత.

మహాభారతంలో ధనలక్ష్మి పూజ ప్రస్తావన ఉన్నది. తనకు లేదనకుండా మూడు అడుగుల నేలను దానమిచ్చిన బలి చక్రవర్తిని వామనమూర్తి ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తిదేవా ! భూమిపైన ఆశ్వియుజ బహుళ త్రయోదశి నుండి మూడు రోజులు నా రాజ్యం ఉండేలాగా, దీపదానాలు దీపారాధనలు చేసుకున్న వారందరూ లక్ష్మీ కటాక్షం పొందే లాగాను అనుగ్రహించండిఅని కోరుకున్నాడు. అప్పటినుంచి లక్ష్మీ పూజ జరుపుకోవడం ఆచారమైంది.

దారిద్ర్యం నశించి, ధనం సిద్ధించాలంటే ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు లక్ష్మీ పూజ చేయాలి. మార్వాడీవారు రోజున పగలంతా ఉపవసించి, చంద్రోదయమయ్యాక వంట చేసి, రాత్రి లక్ష్మీ పూజ చేసి, తరువాత టపాకాయలు కాలుస్తారు.

అమావాస్యా యదా రాత్రే
దివా భాగే చతుర్దశీ !
పూజనేయా తదా లక్ష్మీః
విజ్ఞేయా శుభరాత్రికాః“!! అని పద్మ పురాణం చెప్తోంది. రాత్రి సమయంలో అమావాస్య ఉన్న రోజును దీపావళిగా భావించి, మహాలక్ష్మిని పూజించాలి.

నమస్తే సర్వదేవానాం
వరదాసి హరిప్రియే !
యా గతిః త్వత్ప్రసన్నానాం
సా మే భూయాత్వదర్చనాత్“!!

సర్వ దేవతలకు వరములను ప్రసాదించే హరిప్రియా! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము. నువ్వు ప్రసన్నులైన వారికి సద్గతి లభిస్తుందో,
సద్గతి నీ అర్చన వలన
నాకు లభించుగాక !

ధనదాయ నమస్తుభ్యం
నిధి పద్మాధిపాయ !
భవంతు త్వత్ప్రసాదాన్మే
ధనధాన్యాది సంపదః“!!

ధనమును ప్రసాదించు కుబేరా ! నీకు నమస్కారము. పద్మాది నిధులకు అధిపతివైన నీ అనుగ్రహం చేత ధన ధాన్యాది సంపదలు నాకు కలుగుగాక !! – అని ప్రార్థించాలి.

కుబేరునకు ధనాధిపత్యము శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో లభించింది. మనకు కూడా మహాలక్ష్మి అనుగ్రహంతో ధనం లభిస్తుంది. ధనమంటే డబ్బు మాత్రమే కాదు.
ధనమగ్నిర్ధనం వాయుః, ధనమింద్రో బృహస్పతిః…” అంటూ సుఖము, సంతోషము, శాంతి, ప్రేమ,, కరుణ, ఆత్మీయత, అనురాగము, ఆరోగ్యము, సౌభాగ్యము, సౌమనస్యము, అనుబంధాలు, విజ్ఞానము మొదలైనవన్నీ ధనాలే ! వీటన్నింటినీ మహాలక్ష్మి దేవి మనకు అనుగ్రహిస్తుంది.

ధన త్రయోదశిని మార్వాడి వారుధన్ తెరస్అంటారు. ఆరోజున కొత్త పద్దు పుస్తకాలకు పూజ చేస్తారు. దీపావళిని బెంగాలీలో కాళీ పూజగా భావించి చేస్తారు. ఆంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణలో దీపావళి రోజునకేదార గౌరీ వ్రతంచేస్తారు. కేదారమంటే పంట పొలాలు. వ్యవసాయదారులు తమ శ్రమకు తగిన ఫలం లభించి పొలాలన్నీ పచ్చగా కన్నుల పండుగగా ఉండాలని, అలాగే తమ జీవితాలు కలకాలం కళకళలాడుతూ సాగాలని వ్రతం చేస్తారు.
కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్పతపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. కేదారేశ్వర వ్రతం
చేసిన దంపతులు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు.

గుజరాత్ ప్రాంతంలో దీపావళి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఇంకా నాలుగవ రోజు బలిపాడ్యమినాడు అంటే దీపావళి మరునాడు సుతల లోకం నుంచి వచ్చిన అత్యంత మహనీయుడైన దాత బలి చక్రవర్తిని స్మరించుకోవాలి. రోజున అనే
రకాల వంటకాలు చేసి, శ్రీకృష్ణ పరమాత్మను, గోవర్ధనగిరిని పూజించి, నివేదిస్తారు. రోజున యజ్ఞార్థము
పంచగవ్యాలను ఇచ్చే గోమాతను వత్సతో కలిపి పూజించాలి.

ఇంక మరుసటి రోజునుయమ ద్వితీయభగినీ
హస్త భోజనంఅంటారు. యమధర్మరాజు తన చెల్లెలైన యమునా
దేవి ఇంటికి రోజున వచ్చాడని, ఆమె తన అన్నకు విందు భోజనము పెట్టిందని చెప్తారు. కనుక యమద్వితీయ నాడు అన్నతమ్ములందరూ భగినీ హస్త భోజనము చెయ్యాలి.

దీపావళి పండుగ చేసుకోవటానికి శాస్త్రీయ కారణం కూడా కనిపిస్తుంది. వర్షాకాలంలో పుట్టి పెరిగే దోమలు, ఈగలు, రోగకారక క్రిమి కీటకాదులన్నీ చెట్లనుంచి, పొలాల నుండి వచ్చి అనేక రోగాలు కలుగజేస్తాయి. బాణసంచా కాల్చినప్పుడు
వచ్చే వెలుతురు, చప్పుళ్ళకి, గంధకం, సురేకారం వగైరా రసాయనిక పదార్థాలు కాల్చటం వల్ల వచ్చే వాయువుల వలన క్రిమి కీటకాలు
నశించి రాబోయే రోగాలు అరికట్టబడతాయి. అయితే టపాకాయలు కేవలము గంధకము, సురేకారము వంటి వాటితో మాత్రమే తయారు చేయబడాలి. అప్పుడు వాతావరణము శుభ్రం చెయ్యబడుతుంది, కలుషిత మవదు. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. రాత్రి పూట పది గంటల తరువాత శబ్దం చేసే బాంబులలాంటి వాటిని కాల్చరాదు. పసిపిల్లలకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులు నిద్రాభంగం కలిగించి, ఇబ్బంది పెట్టరాదు. అందరూ ఇటువంటి నియమాలను పాటించాలి.

దీపావళి పండుగ కుటుంబాలలో అనుబంధాన్ని, సాంఘిక సంబంధాలను పెంపు చేస్తుంది. అంతేకాకుండా ఇటువంటి పండుగల వల్ల ఆర్థిక అభ్యుదయం కూడా కలుగుతుంది. దీపావళి టపాకాయలను తయారుచేసి, అమ్మి, ఎన్నో కుటుంబాల వారు సమయంలో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అంటే దీనివల్ల సంఘానికి కూడా మేలు కలుగుతుంది.

దీపావళి మానసిక వికాసాన్ని కలిగించే పండుగ. అజ్ఞానము అనే చీకట్లు తొలగాలి అంటే జ్ఞానము అనే సూర్యుడు ప్రకాశించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి.
తమసోమా జ్యోతిర్గమయఅంటే అర్థం ఇదే ! అమావాస్య నాటి చీకటిని చిరు దివ్వెల వెలుగుతో పారద్రోలాలి, అని మన పెద్దలు చెప్పారు.
ఎప్పటికైనా అధర్మం నశించి, ధర్మం ఉద్ధరింపబడుతుందని, మంచి అన్నదే శాశ్వతమని చాటి చెప్పేదే దీపావళి పండుగ. కుల మత వర్ణ వర్గ
జాతి విభేద రహితంగా సర్వ జనావళీ జరుపుకుని ఆనందించేది దీపావళి పండుగ.

దీపము చైతన్యానికి ప్రతీక. దీపావళి ఉత్సవాలనుకౌముది ఉత్సవాలుఅంటారు. దివ్వెల పండుగ
వచ్చినప్పుడు నాలుగైదు రోజులు ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తూ గడపటం, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, దైవరాధన చేయటం వంటి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. విశ్వమంతా ఆనంద డోలి కలలో తేలియాడుతున్న భావనతో అందరి హృదయాలలో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలు జాగృతమై, సత్యము, ధర్మము, సమతా, ప్రేమ, భూత దయ, సౌమనస్యము వంటి సాత్విక గుణాలు ఉదయించి, ఒక విధమైన ప్రశాంతతని
అనుభవిస్తాము. దీపావళి నాడు పగలంతా బంధుమిత్రుల ఆనందోత్సాహాల పలకరింపులు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలతోను, రాత్రంతా అద్భుతమైన ప్రకాశవంతమైన జ్యోతుల దర్శనంతో, మతాబుల వెలుగుల తేజస్సుతో మనలోని ఆధ్యాత్మిక చీకట్లు తొలగినట్లు, జ్ఞాన ఆనందములు కలిగినట్లుగా ఆత్మానందానుభూతి కలుగుతుంది. దివిలోని తారలన్నీ భువికి దిగి వచ్చినట్లుగా లోకం వెలిగిపోతుంది. ఆనందోత్సాహాలు ఉరకలేస్తాయి. మన హృదయాలు ఆనందమయ
మయినప్పుడు మనం ఆనందాన్ని సర్వప్రాణి
కోటికి పంచగలుగుతాము. పరమాత్మ అనుగ్రహముతో యావద్విశ్వము ఆనందమయమగు గాక !

ఓం సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వస్తి.

రచన :
డా.సోమంచి(తంగిరాల) విశాలాక్షి.
విశ్రాంత సంస్కృతాచార్య. విద్యా శాఖ
తెలంగాణ ప్రభుత్వము.
సెల్ నంబర్
996 396 4033.